ఎక్కడ మొదలు పెట్టాలి మనం?

సీలేరు సంఘటన మరొకసారి మానవహక్కుల సంఘాల పాత్రపై చర్చను లేవనెత్తింది. మనలో చాలామందికి మానవహక్కుల సంఘాల వాళ్లు నక్సలైట్లు ఎన్ కౌంటర్ అయితేనో, అరెస్టు అయితేనో మాత్రమే మాట్లాడుతారు పోలీసులు చనిపోతే మాట్లాడరు అనే అభిప్రాయం ఉంది.

ఇదే విషయంపై ఆవేదన చెందుతూ చదువరి ఒక పోస్టు చేశాడు.

దానికి జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్న కత్తి మహేశ్ కుమార్ పోస్టును ఇక్కడ చూడండి

ముప్పై ముగ్గురు యువకులు అంత దారుణంగా చనిపోతే హక్కుల సంఘాలు ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్న అడిగే ముందు ఒకసారి చరిత్రలోకి వెళ్లాలి. జరిగినది ఒక isolated incident కాదు. It is a part of a long and bloody battle అని అర్థం చేసుకుంటేనే ఈ హక్కుల సంఘాల మౌనం అర్థం అవుతుంది మనకు. హక్కుల సంఘాలు ఎందుకు నక్సలైట్ల సంఘాలుగా ముద్రవేయబడ్డాయో, అవి ఎవరి హక్కుల కొరకు పోరాటం చేస్తున్నాయో కొంచెం లోతుగా పరిశీలిస్తే అర్థం అవుతుంది. 

ఈ క్రమంలో ఇది మొదటి పోస్టు. రెండోది ఒకటిరెండ్రోజుల్లో…

పోలిసుల హత్య ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. మరే కుటుంబానికీ అటువంటి దురవస్థ రాకుండా ఉండాలని కోరుకుందాం. దాని కొరకు ఏమి చెయ్యాలో అలోచిద్దాం. మొదట్లో కింది స్థాయి పోలీసుల పట్ల నక్సలైట్లు కొంచెం కనికరం చూపేవారు. “పొట్టకూటి కొరకు నువ్వు పోలీసు వైనావు అన్నా” అంటూ గద్దర్ పాడిన ఒక పాట అప్పట్ట్లో చాలా ప్రాచుర్యం పొందింది. కానీ ఇటీవలి కాలంలో కింది స్థాయి పోలీసుల పట్ల కూడా నక్సలైట్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారని వార్తలు చెబుతున్నాయి. పరిస్థితి ఇక్కడి దాకా ఎలావచ్చిందో ఒక సారి ఆలోచించాలి మనం.

తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందా రాదా అనే చర్చ కాసేపు పక్కన పెడదాం. జరుగుతున్న యుద్ధం గురించీ, యుద్ధంలో అవలంభిస్తున్న విధానాల గురించీ, పోతున్న ప్రాణాల గురించే మాట్లాడుదాం.

ఇన్ని వేలమంది యువకులు ఈ గడ్డపై ఎందుకు ప్రాణాలకు తెగించి విప్లవోద్యమాల్లోకి వెళ్తున్నారో సరిగ్గా అర్థం చేసుకోకపోతే, సమస్యను పరిష్కరించకపోతే ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న రేపటి తరం ప్రతినిధులు అటు పోలీసుల్లో, ఇటు నక్సలైట్లలో చేరి ఒకరినొకరు వేటాడుకోవడం మన సమాజానికి తీరని నష్టం.

ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఒకరి ప్రాణం విలువైనదీ మరొకరి ప్రాణం విలువలేనిదీ అవదు. ప్రభుత్వమే తను ఏర్పరుచుకున్న చట్టం అతిక్రమించి నిర్బంధానికి తెగబడినప్పుడు అనివార్యంగా సీలేరు వంటి ఘటనలు జరుగుతాయి. చర్చ సీలేరు ఒక్కదాని గురించే ఎందుకు? ముప్పై ఏళ్ల క్రితం శ్రీకాకుళంలో మొదలుపెట్టి నేటి దాకా ప్రభుత్వమే ఎన్ కౌంటర్ల పేరిట ఈ రాష్ట్రంలో ఎంత నెత్తురు పారించిందో తప్పకుండా చర్చించాల్సిందే.

నక్సలైట్లు మన ప్రభుత్వాలనీ, చట్టాలనీ గుర్తించరు. వారు చేసే పనులన్నీ చట్టవ్యతిరేకమయినవే అవుతాయి. వారు చేసిన ప్రతి హింసాత్మక కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు తయారు చేసుకున్న చట్టాల ద్వారా శిక్షించవచ్చు. అది చేతకాక హత్యాకాండ జరపడమే ఈ సమస్యకు విరుగుడుగా మన ప్రభుత్వాలు భావించడం వల్లనే పరిస్థితి ఇక్కడిదాకా దిగజారింది. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే, ప్రజాస్వామ్య స్పూర్తిని వదిలి ఆటవిక రాజ్యం నెలకొల్పితే ఎలా?

నక్సలిజం ఒక సామాజిక సమస్య అనేది అర్థం చేసుకోకుండా మొండిగా అది శాంతి భద్రతల సమస్య అని వాదించే ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి ఉండటం మన దురదృష్టం. జరిగిన తప్పులు దిద్దుకునే బదులు మొన్నటి ఘటన తరువాత ఇంతకు పదిరెట్ల మందిని ఖతం చేస్తాం అని రంకెలు వేస్తున్న తెలివితక్కువ హోం మంత్రి మన జానా రెడ్డి గారు.

ప్రతి ఏటా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నక్సలైట్లను “వేటాడడానికి” ఇస్తున్న వందల కోట్ల రూపాయల డబ్బు ఎలా దుర్వినియోగమవుతున్నదో సాక్షాత్తూ మాజీ పోలీసు అధికారులే బయటపెడుతున్నారు. ఇప్పటిదాకా నక్సలైట్ల అదుపు పేరిట దుబారా చేసిన డబ్బునే కనుక ఆయా ప్రాంతాలా అభివృద్ధికి కేటాయిస్తే ఈపాటికి ప్రజలకు నక్సలైట్లతో పనే ఉండేది కాదు.

గ్రే హౌండ్స్ పేరిట నూనుగు మీసాల యువకులను శిక్షణ ఇచ్చి, ప్రాణం తీస్తే లక్షలు ఇస్తామని వారిని ప్రలోభపెట్టి వారిని లైసెన్సెడ్ కిల్లర్స్ గా మారుస్తున్నారు. అరెస్టు చేస్తే ఏ లాభమూ ఉండదు, కాల్చిపారేస్తే లక్షలు వస్తాయి అంటూ గ్రే హౌండ్స్ పోలీసులను వేటగాళ్లను చేశారు. చంపడానికీ చావడానికీ వారిని అడవుల్లోకి పంపి వినోదం చూస్తున్న ప్రభుత్వ విధానాలే సీలేరు వంటి దుర్ఘటనలకు కారణమవుతుందని మనం తెలుసుకోవాలి.

గత ముప్పై ఏళ్లలో ఇరువైపులా జరిగిన అన్ని హింసాత్మక ఘటనలు మొత్తం తెలుసుకున్నాకే ఒక అవగాహనకు రావాలి మనం. కాకతీయ ఎక్స్ ప్రెస్ పై దాడితో పాటు నక్సలైట్లు చేసిన అన్ని హింసాత్మక చర్యలనూ ఖండించాలి. పోలీసులు ఉన్నారనుకుని బస్సును పొరపాటుగా పేల్చేసిన ఘటనను తప్పకుండా విమర్శించాలి.  ఇన్ ఫార్మర్ల పేరిట వారు చంపేసిన ప్రతి ఒక్కరి ప్రాణమూ విలువైనదే.

రెండు దశాబ్దాల క్రితం ఇంద్రవెల్లిలో గిరిజనులపై విచక్షణారహితంగా పోలీసులు కాల్పులు జరిపితే మరణించిన డజన్లకొద్దీ గిరిజనుల గురించీ,  మానాల అడవుల్లో మత్తుమందుపెట్టి కాల్చి చంపిన పదిమంది గురించీ, బెంగులూరులో పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపి కొయ్యూరు అడవుల్లో పారేసిన ముగ్గురి గురించీ, ఎన్ కౌంటర్ మృతుల కాళ్లు గొడ్డళ్లతో నరకబడి ఎందుకు ఉన్నాయో, వారి శవాలపై కాల్చిన, కోసిన గాయాల గురించీ తప్పక చర్చించాల్సిందే. ఇంట్లో నక్సలైట్లు ఉన్నారని వేలాది మంది ప్రజలు చూస్తుండగా ఇంటి స్లాబుకు రంధ్రం చేసి అందులోంచి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన మన పోలీసుల చట్టబద్ధ హత్యల గురించి తెలుసుకోకపోతే ఎలా మనం?

ఇక నక్సలైట్ కాదని రూడిగా తెలిసినా ఒక పోలీసు అధికారి వ్యక్తిగత కక్ష కారణంగా “ఎన్ కౌంటర్” అయిన వార్త దిన పత్రిక విలేకరి గులాం రసూల్ గురించీ, తార్నాక బస్ స్టాపులో నిలబడి ఉంటే “పొరపాటు”గా పోలీసులు కాల్చిచంపిన నాగార్జున రెడ్డి గురించీ, రెండేళ్ళ క్రితం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తూ “ఎన్ కౌంటర్” అయిన రైతులు, ఏదో పెళ్లిలో సన్నాయి వాయించి ఇంటికి వెళ్తుండగా “ఎన్ కౌంటర్” అయిన వాద్యకారులు, పశువులు కాసుకుంటు “ఎన్ కౌంటర్” అయిన పేద బాలుడి గురించి కూడా తెలుసుకోవాలి మనం.

నల్లగొండ జిల్లా రాచకొండ గుట్టల్లో ఇదే గ్రే హౌండ్స్ చేతిలో “ఎన్ కౌంటర్” అయిన మూడేళ్ల బాలిక మౌళిక గురించి కూడా చర్చించడం మనం మరచిపోవద్దు.

అసలు “ఎన్ కౌంటర్” అన్న పదానికి అర్థమే చట్ట విరుద్ధమైన హత్య అనే స్థాయికి దిగజారింది మన దేశంలో. 

కత్తుల సమ్మయ్య అనే ఒక మాజీ నక్సలైట్ ను సాక్షాత్తూ ఈ రాష్ట్ర డిజీపీ స్వయంగా వ్యాపార భాగస్వామిగా పెట్టుకుని జర్మనీ వీసా ఎందుకు ఇప్పించాడో అడగాల్సిందే.

ఐ.పీ.ఎస్. అధికారి వ్యాస్ ను కాల్చి చంపిన నయీముద్దీన్ అనే మాజీ నక్సలైట్ తదనంతర కాలంలో మన పోలీసు పెద్దల ప్రాపకంతో నగరంలో రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, మర్డర్లు చేయడం ఎందుకు చేస్తున్నాడో తప్పక చర్చించాలి మనం.

వారి కంటితో వారినే పొడిచేందుకు గిరిజన బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కుటిల నీతిని తప్పక ప్రశ్నించాల్సిందే మనం.

ఒకసారి కేరళలో, మరొకసారి తమిళనాడులో, ఇంకొకసారి ఉత్తరభారతంలో ఎక్కడో ఒక చోట నక్సలైట్ అగ్ర నాయకులను పట్టుకురావడం వారిని మన రాష్ట్రంలోని ఏదో ఒక అడవిలో కాల్చిచంపడం ఏ చట్టాలకు లోబడి చేస్తున్నారు మన పోలీసులు? శాంతి చర్చల ప్రతినిధి, జనశక్తి నేత రియాజ్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసినట్టు అన్ని చానెళ్లు వార్త ప్రసారం చేసిన తరువాత, రియాజ్ అరెస్టును గురించి దినపత్రికలు రాసిన తరువాత మరుసటి రోజు అతను కరీంనగర్ జిల్లాలో  “ఎన్ కౌంటర్” అవడం దేన్ని సూచిస్తుంది? ప్రతి ఎన్ కౌంటర్ ను సెక్షన్ 302 కింద హత్యానేరంగా నమోదు చెయ్యాలనే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు ఖాతరు చేయట్లేదో ఒకసారి తప్పక ప్రశ్నించాలి మనం. మన రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు జరిగిన అనేక సందర్భాల్లో వార్తా పత్రికలు అవి బూటకపు ఎన్ కౌంటర్లు అని సాక్ష్యాలతో సహా నిరూపించాయి. అయినా ప్రభుత్వం ఈ ఎన్ కౌంటర్ హత్యలకు పాల్పడ్డవారిపై ఏ చర్యా తీసుకోలేదు.

మొన్నటికి మొన్న పదకొండు మంది గిరిజన యువతులపై గ్రే హౌండ్స్ పోలీసులు ఆఘాయిత్యం చేస్తే సదరు పోలీసులను వెనకేసుకొచ్చి ఆ యువతులదే తప్పని తేల్చింది మన ఘనత వహించిన ప్రభుత్వం. ఇలా చేశాక ఇక ఆ గిరిజనులు ప్రభుత్వాన్ని నమ్ముతారా నక్సలైట్లను నమ్ముతారా?  (తాజా కలం)

నక్సలైట్లను కదా చంపింది అని మనం ఊరుకుంటే, ఈ అపసవ్య విధానాలను ప్రశ్నించకపోతే రేపు మీ చేతిలోనో, నా చేతిలోనో ఒక తుప్పు పట్టిన తపంచా, కొంత “విప్లవ సాహిత్యం” ఉంచి చంపేయగలరు మన పోలీసు సార్లు.

 

ఇక పౌర హక్కుల సంఘాల గురించి వచ్చే పోస్టులో మాట్లాడుకుందాం.

11 స్పందనలు నుండి “ఎక్కడ మొదలు పెట్టాలి మనం?” కు


  1. 1 కె.మహేష్ కుమార్ 10:15 పూర్వాహ్నం వద్ద జులై 4, 2008

    చాలా సూటిగా చెప్పారు.

    పోలీసుల గూండారాజ్యాన్ని, ప్రభుత్వ అరాచకత్వాన్నీ తమ జీవితాలలో లేక తమవారి జీవితాల్లో అనుభవించని, చాలా మంది మధ్యతరగతి మనుషులకు ఈ అప్రకటిత యుద్దం గురించి మీడియా చెబితేతప్ప తెలియదు. అలాంటిది, ఈ విషయాల పట్ల ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు తెలుపని చెప్పడం సాహసమే అయినా, అది చాలా అవసరం అని నా భావన.

    అంతేకాక మనకు తెలిసిన సమాచారాన్ని వారికి తెలియజెప్పడం మన కనీస బాధ్యత.అందుకే నేనూ ప్రయత్నించాను. మీ ప్రయత్నానికి నా అభినందనలు.

  2. 2 వికటకవి 12:55 అపరాహ్నం వద్ద జులై 4, 2008

    దిలీప్ గారూ,

    మీ ఈ టపా అంత సహేతుకంగా నాకు కనపడలేదు సరికదా నిరాశ కలిగించింది. మీ సమర్ధింపు ఎవరి వైపు అన్నది మొదట్లోనే తెలిసిపోయింది. ఒకవేళ ఈ విషయం మీరు విశ్లేషణాపరంగా కన్నా ఓ విప్లవోద్యమ(నిజానికి నాకు ఈ పదం నక్సలైట్లకి వాడటం ఇష్టం లేదు) సానుభూతిపరునిగా రాస్తే ఓకే.

    గ్రేహౌండ్స్ ఎంటీఆర్ హయాం… అంతకు ముందు పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ అసలు పట్టించుకోకుండా వదిలేసిన రోజుల్లో చెలరేగిన వారి గూర్చి చెప్పనే లేదు మీరు. ముఖ్యంగా, అన్నీ తెలిసి ఇలా అంటారేమిటి?

    “వారు చేసిన ప్రతి హింసాత్మక కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు తయారు చేసుకున్న చట్టాల ద్వారా శిక్షించవచ్చు”……

    అంటే వాళ్ళు చంపుతూ పోతే, ఏళ్ళ తరబడి ఒక్కొక్కళ్ళనీ సాగతీత విచారణలతో జైల్లో ఉంచి తరువాత క్షమాభిక్ష పేరుతో బయటకి పంపటమేనా?

    ఈ సందర్భంగా “గమ్యం” సినిమాలో దర్శకుడు క్రిష్ చెప్పించిన డైలాగులు (మాజీ నక్సలైట్ పాత్ర చేత) గుర్తొస్తున్నాయి.

    “అసలయిన మృగాలు అడవిలో కాదు కామ్రేడ్, ప్రజల మధ్యలో ఉండి వాళ్ళని పీక్కు తింటున్నాయి. అడవిలో కంటే బయటకొచ్చి వాటితో పోరాడదాం”

    మరో పాత్రతో

    “మిమ్మల్ని మీరు కాపాడుకునే బాధల్లో మీరుంటే మా(ప్రజలు) కోసం వచ్చే టైం మీకెక్కడుంటుందిలే అన్నా”

    పోనీ ఇదంతా పక్కనబెట్టి, ఓ రాబిన్ హుడ్ లాగా అవినీతిపరులని దోచి సమాజానికి పంచుతారా అంటే అదీ లేదు? ఎప్పుదో చేసే ఓ హడావిడి తప్ప.

    అంత తాపత్రయం ప్రజల మీద ఉంటే, ఇన్నేళ్ళలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఓ బడి లేదా ఓ ఆసుపత్రి ఏర్పాటు చేసారా? నాంది లాంటి సంస్థలు, అటవీ ప్రాంతంలో చిన జీయర్ ఏర్పాటు చేసిన స్కూళ్ళు ఇవన్నీ గత 10 ఏళ్ళలో చేసినవి, కళ్ళకి కనపడుతున్న ప్రగతి ఇది.

    మీ తరువాతి టపా కోసం ఎదురు చూస్తా… వీలైతే నా ప్రశ్నలకి సమాధానాలివ్వండి.

  3. 3 ప్రవీణ్ గార్లపాటి 4:32 అపరాహ్నం వద్ద జులై 4, 2008

    ఎటూ మొగ్గట్లేదు అంటూనే మీ టపా తప్పకుండా నక్సల్స్ వైపే మొగ్గుతుంది.

    చూస్తే రెండిటినీ సమానంగా చూడాలి కదా. పోలీసుల, ప్రభుత్వ ఆకృత్యాలు ఏకరువు పెట్టారు. అంతకన్నా ఎక్కువగా ఉన్న నక్సల్స్ ఆగడాలను మాత్రం ఓ పేరాతో వదిలేసారు.

    ఏ పాపం తెలియని అమాయకులను చంపేస్తున్న, లక్ష్యం ఎప్పుడో పోయి డబ్బుల కోసం వెంపర్లాడుతున్న వారి గురించి చెప్పనే లేదు.
    నక్సల్స్ అని చెప్పుకుని వందలాది ఎకరాలు కబ్జా చేసి ఎవరికీ పంచని వారి గురించీ చెప్పలేదు.

    పోలీసులు ఎన్‌కౌంటరు చెయ్యడం తప్పే. అయితే వారిని ఇష్టమొచ్చినట్టు చంపితే వారు మాత్రం ఊరుకుంటారా ? ఇది రెండు వైపులకీ వర్తిస్తుంది. మరి ముందు ఎవరు ఆపాలి ?

    తమను తాము కాపాడుకోవడం కోసం అనే నెపంతో ఏకె 47 లు దిగుమతి చేసుకోవడం, ఎక్కడెక్కడి నుంచో మారణాయుధాలు సేకరించడం సమర్థనీయమా ?

  4. 4 తాడేపల్లి 5:33 అపరాహ్నం వద్ద జులై 4, 2008

    ఆఱెకరాల రైతుల్ని చంపడంలోను, పేదల కాళ్ళూ చేతులూ నరకడంలోను ఏ సామాజిక విప్లవ మూలాలున్నాయో నేనర్థం చేసుకోలేకపోతున్నాను.

    నక్సలైట్లే కాదు, దొంగలూ, కిరాయి హంతకులూ, రేపిస్టులూ కూడా మన చట్టాల్నీ, ప్రభుత్వాన్నీ గుర్తించరు. అంతమాత్రాన వాళ్ళు క్షమార్హులు కారు. చట్టాల్ని గౌరవించనివారిని చట్టప్రకారంగా ట్రీట్ చెయ్యాలని పౌరహక్కుల సంఘాలు కోరతాయి. అది సాధ్యపడదు. చేసిన నేరమే మళ్ళీ మళ్ళీ చేస్తానని బాహాటంగా ప్రకటించేవాడు, అలా కొనసాగుతున్నవాడు చట్టబద్ధమైన ట్రీట్ మెంటుకు నైతికంగా అర్హుడు కాడు.

    నక్సలైట్లు మనకోసం పోరాడుతున్నారనే అభిప్రాయంలో మీరున్నారు. అందుకే ఇలా వెనకేసుకొస్తున్నారు. వాళ్ళ పోరాటం ఎవరికోసమూ కాదు, కేవలం తమకోసమని నేను చెబుతున్నాను.

  5. 5 చదువరి 7:52 అపరాహ్నం వద్ద జులై 4, 2008

    దిల్ గారూ, బాగా చెప్పారు. అన్నీ ఖచ్చితంగా ప్రశ్నించాల్సినవే! పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. అవి ఖచ్చితంగా ఖండనార్హమే. నేనన్నదల్లా – రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!

    అన్నట్టు, ఆ బెంగుళూరులో పట్టుబడి ఎన్‌కౌంటరయిన ముగ్గురిలో ఇద్దరు అంతకు ముందు చిక్కి, శిక్ష పడినవారే. శిక్ష పూర్తయ్యాకో, తప్పించుకునో మళ్ళీ అదే బాట పట్టారు. ప్రజాస్వామ్యయుతంగా శిక్షలేస్తే వాళ్ళు చేసే పని ఇదీ! అంత మాత్రాన ఎన్‌కౌంటరు సమర్ధనీయమని కాదు, విషయం చెబుతున్నాను.

    పోతే మీరు ఇక్కడ లేవనెత్తిన విషయాలకు సంబంధించి నేనో జాబు రాస్తాను నా బ్లాగులో!

  6. 6 Dil 7:41 పూర్వాహ్నం వద్ద జులై 5, 2008

    స్పందించిన మిత్రులందరికి కృతజ్ఞతలు. నక్సలైట్లు చట్టం ఉల్లంఘిస్తున్నారు కాబట్టి. ఇప్పుడున్న చట్టాలు, న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించలేం కాబట్టి వాళ్లని ఇలా ఉత్తుత్తి ఎన్ కౌంటర్లలో కాల్చి చంపొచ్చు అనే అభిప్రాయం ఇక్కడ కొద్దిమంది వెలిబుచ్చారు. దానికి మూడో భాగంలో జవాబిస్తాను.

    ఒక్కసారి అలోచించండి ఉదాహరణకు మన దగ్గరి వాళ్ళు ఎవరైనా హత్యకు గురైతే ఆ హత్య చేసిన హంతకుడిని మనం చంపితే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇలా వారు చంపారని మేమూ చంపుతాం అనేది ఆటవిక న్యాయం అవుతుంది. అలాంటి న్యాయమే అమలు జరగాలని కనుక మనం కోరుకుంటే ఈ సమాజంలో ఈనాడు మనబోటి వారెవరూ బతికి బట్టకట్టలేదు.

    ఇక నా పోస్టులో పోలీసుల ఆకృత్యాలే ఎందుకు ఏకరువు పెట్టారు అని ప్రవీణ్ అడిగాడు.

    దానికి కారణం ఒక్కటే. నక్సలైట్లు చేస్తున్న హింసాత్మకమైన పోరాటం గురించీ, తద్వారా జరిగిన నష్టం గురించీ ఇప్పుడు నేను చెబితేనే తెలుసుకునే పరిస్థితిలో ఎవరూ లేరనే నా అభిప్రాయం. అయితే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు తాము నెలకొల్పిన చట్ట, న్యాయ వ్యవస్థలను ఇలా తుంగలోకి తొక్కి నేరుగా ప్రాణహననానికి దిగడం చివరికి సమాజాన్ని మరింత హింసలోకే నెడుతుంది కానీ సమస్యను ఎప్పటికీ పరిష్కరించదు అని నా అభిప్రాయం.

  7. 7 నరేంద్ర భాస్కర్ S.P 8:00 అపరాహ్నం వద్ద జులై 7, 2008

    ఈ విషయం పైనే ఒకానొక సందర్భం లో కాళోజీ ఇలా అన్నారు
    “హింస తప్పే, ప్రతి హింస తప్పుకాదు, రాజ్య హింస పెద్ద తప్పు”,
    ఇది నాకు తెలిసిన దృక్కొణం

  8. 8 sandeepchilukuri 7:24 అపరాహ్నం వద్ద జులై 11, 2008

    hi Dilip garu, I have few doubts on targets (lakshyalu) of Maoists or Poura sangalu. Please clarify my doubts…

    (i) What is the aim of naxalites? How it can be achievable?

    (ii) Where does the word “mao” comes from?

    (iii) How can naxalites change living conditions of our people if they come to power? May i know which path they take…capitalism or communism(which is worstly failed in every part of earth..Example in soviet union,India(Till 1990)…even china forgat Mao in 1978)?

    (iii) Is really china supports mao’s economic policies? If so why china is taking different approach from mao in economic policies and getting high growth rate,which enhances living conditions of their people?

    (iii) If suppose war comes between China and India…which side naxalites (so called communists) support… our mother land or China?

    I would be verymuch happy if you give stright for these questions.

  9. 9 Dil 4:43 పూర్వాహ్నం వద్ద జులై 14, 2008

    సందీప్ గారూ,

    బ్లాగు సందర్శించి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. తెలిసి అడిగారో తెలియక అడిగారో కానీ మీరు అడిగిన వాటిలో చాలా ప్రశ్నలు ప్రాధమిక ప్రశ్నలు. వీటికి జవాబులు మీరు ఏ కొంచెం శ్రమించినా పుస్తకాల్లో (లేదా అంతర్జాలంలో) లభ్యమవుతాయి.

    కొంచెం సమయం వెచ్చించి ఈ విషయాలపై ఒక అవగాహనకు రాగలరు.

    దిలీప్

  10. 10 Sridhar 6:30 అపరాహ్నం వద్ద జులై 27, 2008

    మీరు రాసినదానికి ఇది సమర్ధింపా లేక ఇంకోటా? అనేది చూసే ముందు ఒక విషయం. నేను 5న్నర సం. సీలేరులో పనిచేశాను. అక్కడ APGENCO HYDEL POWER STATION వుంది. ఆ వూర్లో tribals తో పాటు 25 ఇంజనీర్లు, 300 మంది వర్కర్లు వుంటారు. 2005 Dec 24 న Hydel Plant లో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. కోట్ల రూపాయల నష్టం చేశారు. అది ప్రభుత్వానికి నష్టం అని వొదిలేద్దాం, అదే రాత్రి వాళ్లకి సంబంధం లేని 350 ఉద్యోగుల అపార్ట్ మెంట్ మీద , ఇళ్ల మీద రాకెట్ లాంచర్లతో హేయంగా దాడి చేయటంలో ఉద్దేశం ఏమిటి? అదృష్టవశాత్తూ, గెస్ట్ హౌజ్ తప్ప యేదీ బ్లాస్ట్ అవలేదు. దీనికి ప్రర్యక్ష సాక్షి నేను. దీనికేమంటారు?

  11. 11 Dil 3:43 పూర్వాహ్నం వద్ద జులై 28, 2008

    శ్రీధర్ గారూ,

    మీరు ఎంత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారో నేను ఊహించగలను. మావోయిస్టులు చేస్తున్న ప్రతి హింసాత్మక చర్యనూ ఖండించాల్సిందే, దానికి వారిని చట్టప్రకారం శిక్షించాల్సిందే.

    అయితే పోస్టులో నేను చెప్పదలుచుకున్నది Rule of Law అమలు గురించే…

    దిలీప్


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,242 సందర్శకులు