వ్యక్తిగత పనిమీద గురువారం సూర్యాపేటకు వెళ్ళాను. అక్కడికి చేరుకునేసరికే రాత్రి పదకొండు దాటింది. అన్నం తిని నిద్రపోయిన గంట సేపటికి నా సెల్ ఫోన్ లో మిత్రుడు పిట్టల శ్రీశైలం ఇచ్చిన ఎసెమ్మెస్ నన్ను నిద్రలేపింది. మానవహక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ హఠాన్మరణం చెందారని. ఒక్క క్షణం అర్థం కాలేదు. హక్కుల నేతలు మరణించారంటే ముందు అనుమానం పోలీసులపైకే మళ్లే రాష్ట్రం ఇది. కాసేపయ్యాక తెలిసింది ఆయన అనారోగ్యంతో మరణించారని.
పోలేపల్లి సెజ్ బాధిత ప్రజల కొరకు ప్రజా కోర్టు నిర్వహించినప్పుడు బాలగోపాల్ గారి పని విధానం అతి దగ్గరగా చూసే అవకాశం కలిగింది నాకు. ఈ దేశంలో పీడితుల పక్షాన సుధీర్ఘ కాలం నిలిచి పోరాడిన అతి కొద్ది మంది మేధావులలో బాలగోపాల్ ఒకరు.


పోలేపల్లి సెజ్ పబ్లిక్ హియరింగ్ లో బాలగోపాల్ పాల్గొన్నప్పటి చిత్రాలు
పౌర హక్కులంటే నక్సలైట్ల హక్కులేనా అని ప్రశ్నించే అనేకమంది బాలగోపాల్ తన జీవిత కాలంలో ఎన్ని వర్గాల ప్రజల హక్కుల కొరకు పోరాడాడో ఒక సారి తెలుసుకోవాలి. నిరాడంబరమైన ఆయన జీవన విధానం, అలుపెరగని ఆయన పోరాట స్ఫూర్తి నిజంగా అనితర సాధ్యం.
కొద్దికాలం క్రితమే మరో గొప్ప హక్కుల నేత గొర్రెపాటి నరేంద్రనాధ్ మృతిచెందారు. ఇప్పుడు బాలగోపాల్ కూడా మరణించడంతో రాష్ట్రంలో హక్కుల ఉద్యమానికి తీరని నష్టం కలిగింది.
కామ్రేడ్ బాలగోపాల్ అమర్ రహే!










