తెలంగాణా ప్రాంతంపై మన రాష్ట్ర పాలకుల నేరపూరిత నిర్ల్యక్షానికి నల్లగొండ జిల్లాను అనేక దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతం ఒక ఉదాహరణ. పక్కనే కృష్ణమ్మ నీరు శిశువుకు దక్కని స్థన్యంలా పారుతూ అటు డెల్టాకు సాగు నీరు, ఇటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తుంటే నల్లగొండ జిల్లా ప్రజలు మాత్రం ఫ్లోరిన్ విషపు జలాలతో గొంతు తడుపుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత కూడా ప్రజలకు తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లను ఇవ్వలేని మనం “అభివృద్ధి” సాధించామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.
పల్లెలు గొంతులో పచ్చి విషం నింపుకుంటుంటే వేలకోట్ల ప్రపంచ బ్యాంక్ డబ్బుతో రాజధాని నగరానికి కృష్ణ నీరు కొండలు గుట్టలూ దాటి ఖరీదు కట్టే షరాబులను వెదుక్కుంటూ పైపులైన్లలో పరుగులు పెడుతోంది. నగరంలో కోకకోలా ప్లాంట్లకూ ఈ నీరే రెండు పైసలకు లీటర్ ధరకు సరఫరా అయి మనకు “కిన్లే” అనే 12 రూపాయల మినరల్ వాటర్ సీసా రూపంలో లభ్యమవుతుంది.
వాటర్ బోర్డు వారి Dial A Tanker ప్రకటన చూశారా? 250 రూపాయలకే “స్వచ్చమైన, సురక్షితమైన” 5000 లీటర్ల నీరు. అంటే 5 పైసలకు లీటర్ నీరు. మరి నల్లగొండ నుండి మోసుకొచ్చి, శుద్ధి చేసి నగర ప్రజలకు పైపుల్లో, ట్యాంకర్లలో, ఇప్పుడయితే ఏకంగా సీసాల్లో (వాటర్ వర్క్స్ వారు మినరల్ వాటర్ కూడా అమ్ముతున్నారు) సరఫరా చేయగల వనరులు, సాంకేతిక విజ్ఞానం మన దగ్గర ఉంది. కానీ అదేం చిత్రమో నల్లగొండ జిల్లాలోని పల్లెలకు మాత్రం మంచి నీరు ఇవ్వలేదు మన ప్రభుత్వం. బహుశా వారికి “మార్కెట్” సైజు సరిపోలేదేమో
అయినా నేటి “మార్కెట్” లో మనుషులకు ఎక్కడుంది స్థానం… ఇక్కడంతా అమ్మకందారులు కొనుగోలుదారులే కదా.
నీరు పల్లమెరుగు అనేది పాత సామెత. ఇప్పుడైతే నీరు “మార్కెట్” నే ఎరుగును.
లక్షల మంది పౌరులు విషపూరితమైన నీరు తాగి జీవచ్చవాలుగా మారుతుంటే మన ప్రభుత్వాలేమో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నాయి. మాకు తాగేందుకు గుక్కెడు నీళ్లిప్పించమని నల్లగొండ వాసులు అనేక ఏళ్లుగా చేస్తున్న విజ్ఞప్తులు, ఉద్యమాలు మన నేతల చెవికి సోకట్లేదు.
ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వాల నిర్ల్యక్షాన్ని ఎండగట్టే ఉద్దేశంతో దుశ్చర్ల సత్యనారాయణ అనే సామాజిక ఉద్యమకారుని నేతృత్వంలో 1994 పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 500 మంది నల్లగొండ ఫ్లోరిన్ బాధితులు నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా సమస్య గురించి దేశవ్యాప్తంగా తెలిసింది కానీ పరిష్కారం మాత్రం లభించలేదు.
ఈ సమస్య తెరమీదికి వచ్చినప్పుడల్లా నాలుగు రోజులు మీడియా హడావిడి చేస్తుంది, ఆ తరువాత షరా మామూలే. ప్రతీ ఎన్నికల రుతువులో రాజకీయ నాయకులు రావడం, ఫ్లోరిన్ సమస్య నుండి విముక్తి కలిగిస్తామని వాగ్ధానలు చేయడం, ఎన్నికలు ముగియగానే ముఖం చాటేయడం…ఇదీ తంతు.
మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ ఫ్లోరిన్ సమస్య తెర మీదికి వచ్చింది. అనేక ఏళ్లుగా ఫ్లోరిన్ బాధితుల పోరాటానికి Poster Child గా నిలిచిన తిరుపతమ్మ మరోసారి ప్రభుత్వ నిర్ల్యక్షాన్ని నిరసిస్తూ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది. అయితే ఏదో చిన్న కారణంతో అధికారులు ఆమె నామినేషన్ తిరస్కరించారు.
తిరుపతమ్మకు ఈ యేడాది యంగ్ ఉమన్ అచీవర్ అవార్డు లభించిందని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇవాళ్టి ఈనాడు వసుంధరలో తిరుపతమ్మ పై వచ్చిన కథనం కింద చదవండి:



























