వినాయక్ సేన్ విడుదల

Binayak-sen

Photo By: STRDEL/AFP/Getty Images

హక్కుల ఉద్యమకారుడు, చిన్న పిల్లల డాక్టర్ వినాయక్ సేన్ కు నిన్న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ జైల్లో గత రెండేళ్లుగా మగ్గుతున్న ఈ గొప్ప మనిషి ఎట్టకేలకు స్వేచ్చా వాయువులు పీల్చగలిగాడు.

ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, రూల్ ఆఫ్ లా ను తానే అతిక్రమించే రాజ్యం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించగలదో వినాయక్ సేన్ ఉదంతం నిరూపిస్తుంది. ఈ దేశంలో న్యాయ, చట్ట వ్యవస్థలు కేవలం బలహీనులనూ, వారి పక్షాన ఉన్నవారినీ వేధించడానికి మాత్రమే పనికి వస్తాయని వినాయక్ సేన్ ను రెండేళ్లు బంధించి మరో సారి నిర్లజ్జగా చాటుకుంది మన భారత ప్రభుత్వం.

తనతో పాటు వైద్య విద్య నభ్యసించిన వారు విదేశాలు ఎగిరివెళ్లి కోట్లు గడించాలని అలోచించే సమయంలో చత్తీస్ గఢ్ లోని ఒక మారుమూల ప్రాంతంలో అభాగ్యులకు సేవచేయాలనుకోవడమే ఆ డాక్టర్ సాబ్ చేసిన పెద్ద తప్పు. చత్తీస్ గఢ్ లో మృగ్యమవుతున్న పౌరహక్కుల గురించి సేన్ పోరాటం చేయడం సహజంగానే అక్కడి బీజేపీ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. మావోయిస్టుల ఏరివేతకొరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంతక ముఠా “సాల్వాజుడుం” సాగిస్తున్న అరాచకాలపై వినాయక్ సేన్ గళమెత్తడంతో ఆయన నోరును శాశ్వతంగా మూసేసేందుకు ఓ తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారు చత్తీస్ గఢ్ పోలీసులు.

నారాయణ సన్యాల్ అనే నక్సలైట్ నేతకు కొరియర్ గా పనిచేశాడనే కేసు ఆయనపై బనాయించారు. పోలీసులు నమోదు చేసిన కేసులోని లొసుగులను మీడియా ఎత్తిచూపినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల ఉద్యమకారులు ఎంత ఆందోళన చేసినా చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతిస్పంధించలేదు. మనం రాసుకున్న చట్టాల ప్రకారమే వినాయక్ సేన్ కు బెయిల్ రావాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. రెండు దశాబ్దాలకు పైబడి ప్రజాజీవితంలో ఉంటున్న వినాయక్ సేన్ ను కరడుగట్టిన నేరస్థుల కన్నా ఘోరంగా చూసింది.

సేన్ ను విడుదల చేయాలని జరిగిన ఆందోళనల్లో ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలు, కళాకారులు, రచయితలూ, హక్కుల ఉద్యమకారులూ పాల్గొన్నారు. ఆయనను అరెస్టు చేసిన ఏడు నెలలకు ఇండియన్ అకాడెమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ వినాయక్ సేన్ కు ఆర్. ఆర్. కీతన్ గోల్డ్ మెడల్ ను ప్రధానం చేసింది. గత ఏడాది జైలులో ఉండగానే ఆయనకు ప్రపంచ ప్రఖ్యాత జోనాధన్ మన్ అవార్డ్ కూడా లభించింది.

అసలు చత్తీస్ గఢ్ లో ఇప్పుడు “శాంతిని నెలకొల్పేందుకు” జరుగుతున్న ప్రయత్నాలకు అసలు కారణం వేరే ఉంది. ఏ దండకారణ్యంలోనయితే దుర్భర దారిద్ర్యంలో ఆదివాసులు మగ్గుతున్నారో అదే దండకారణ్యపు గర్భంలో అపార ఖనిజరాశులు దాగి ఉన్నాయి. వాటిపై పోస్కో, వేదాంత, టాటా, మిట్టల్, జిందాల్ వంటి స్వదేశీ, విదేశీ కంపెనీల కళ్లు పడ్డాయి. ఆ కంపెనీల దోపిడీకి అడ్డుగా నిలిచింది కేవలం మావోయిస్టులే. కాబట్టే ఇప్పుడక్కడ శ్మశాన శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

మన దేశపు యువతకు క్రికెటర్ ధోనీ తెలిసినంతగా వినాయక్ సేన్ ఎవరో తెలియక పోవచ్చు. వెల్లూర్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించిన ఈ డాక్టర్ సాబ్ చత్తీస్ గఢ్ అడవుల్లో ఆదివాసీలకు దేవునిగా ఎలా మారాడో, ఇలాంటి మనిషిని అక్కడి ప్రభుత్వం ఒక నల్ల చట్టం కింద అరెస్టు చేసి రెండేళ్లు చీకటి కొట్టులో ఎందుకు బంధించిందో తెలుసుకునే తీరిక IPL మత్తునించి ఇంకా తేరుకోని జెనరేషన్ కు అవసరం అనిపించకపోవచ్చు. కానీ మనకు తెలియకుండానే ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా పతనమవుతున్నాయో, పైకి “ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం” అని పేరుతెచ్చుకున్న దేశంలో పాలకులు అనుసరిస్తున్న కౄర నిర్బంధం అసలు స్వరూపమేమిటో తెలియాలంటే మనం వినాయక్ సేన్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు వాళ్ళు వినాయక్ సేన్ కొరకు వచ్చారు అని మనం మౌనంగా ఉంటే రేపు మన వంతే కావచ్చని మరువరాదు.

వినాయక్ సేన్ గురించి మరింత సమాచారం కొరకు చూడండి:

http://www.binayaksen.net/

http://www.tehelka.com/story_main37.asp?filename=Ne230208The_Doctor.asp

8 స్పందనలు నుండి “వినాయక్ సేన్ విడుదల” కు


  1. 1 కె.మహేష్ కుమార్ 9:36 పూర్వాహ్నం వద్ద మే 26, 2009

    కోర్టులు కోపంగా చూస్తేగానీ ప్రజాస్వామ్యంలో “న్యాయం” జరగదంటే అన్యాయమే. ముఖ్యంగా రాజ్యహింస ఎంద దారుణమో ఎత్తిచూపే ఉత్తమ ఉదాహరణ బినాయక్ సేన్ కేసు. మొత్తానికి కొంత రిలీఫ్.

  2. 2 మార్తాండ 1:09 పూర్వాహ్నం వద్ద మే 27, 2009

    మానవ హక్కుల కోసం ఉద్యమించేవాళ్ళందరూ తీవ్రవాదులు & కాన్స్పైరేటర్స్ అనడం ప్రజాస్వామిక నియంతలు నమ్మే బూటకపు ప్రజాస్వామిక సూత్రం.

    బూటకపు ప్రజాస్వామ్యం నశించాలి, శ్రామిక విప్లవం వర్ధిల్లాలి, ప్రపంచాన్ని గెలవబోయేది శ్రామికులే!

  3. 3 kumar varma 1:13 అపరాహ్నం వద్ద మే 27, 2009

    agra raajyaaniki ammudu poyina prabhutvaalu prajalanu bhayapettemduku ilaa prasnimche vaallanu bandhnchi vaallake dikkuledu meerenta ani cheppadaaniki emchukunna maargam. courtlu kooda chaalaa kaalam kallu moosukunna tarvaata ilaanti teeprulichi paruvu nilupukone prayatnam chestunnayi. mee spamdana baagumdi. Thanks.

  4. 4 Marthanda 4:08 అపరాహ్నం వద్ద మే 29, 2009

    కోర్టులో న్యాయమూర్తులకి జీతాలిచ్చేది పాలకవర్గం వాళ్ళే కదా. పాలక వర్గం వాళ్ళు ఎలా తీర్పులు చెప్పమంటే అలాగే తీర్పులు చెపుతారు.

  5. 5 తాడేపల్లి 9:50 పూర్వాహ్నం వద్ద మే 30, 2009

    నాకెవరిమీదా వ్యతిరేకత లేదు.కానీ అంత బహిరంగంగా అంటే అది contempt of court అవుతుంది. ఇలాంటివి off the record గా పోనివ్వండి. లేదా సాధ్యమైనంత డొంకతిరుగుడుగా రాయండి.

  6. 6 nutakki raghavendra rao 9:00 అపరాహ్నం వద్ద జూన్ 3, 2009

    మీ ప్రయత్నం అభినందనీయం.
    ప్రభుత్వాల అసమర్ధతను, ప్రజా సమస్యలపట్ల ప్రభుత్వాలు చూపే నిర్లక్ష్యాన్ని , వైఫల్యాలను అవకాశవాదాన్ని ,సామాజిక చింతనతో ఎలుగెత్తి చాటాలనుకున్న వారందరూ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల కు తీవ్ర వాదుల గానో చట్ట వ్యతిరేకుల గానో కనపడటం లో ఆశ్చర్య లేదు. ఎందుకంటే వాళ్ళడబ్బులు కుప్పించి కొనుక్కున్న అధికార పీఠానికి కాళ్ళు విరుగుతాయని భయం . న్యాయ వ్యవస్త సంపూర్ణంగా ప్రక్షాళన కావాలంటే పాలనా వ్యవస్థ పూర్తిగా మారాలి . అంటే రాజకీయ వ్యవస్థ ,వోటు బ్యాంకు రాజకీయ వ్యవస్థ సంపూర్ణంగా మారాలి . ప్రస్తుతం కొన్నాళ్ళయినా

    దేశానికి
    దేశ సౌభాగ్యం కాంక్షించే నియంత ,
    దేశ హితం కాంక్షించే నియంత ,
    అన్యాన్ని అక్రమాన్ని నిర్మూలించి ,సామాన్య జన జీవనాలలో వెలుగులు నింపే ,నియంత ,
    అధికార మదాన్ధతతో చేసిన తప్పులను ఒప్పులుగా నిరూపించుకొనే అధికార యంత్రాంగపు దౌర్జన్యాలను ఆపకలిగే నియంత,
    వోట్ల రాజకీయాలతో దేశ జన సామాన్యులను వివిధ వర్గాలుగా ,ప్రాంతాలుగా ముక్కలు చెక్కలుగా విభజించి విద్వేషాలు రెచ్చగొట్టి స్వప్రయోజనాలు పొందే రాజకీయ ముఠాలను అణగద్రొక్కే నియంత ,
    ప్రజల సొమ్మును ప్రజలకు చేరకుండా దండుకొనే దళారీ వ్యవస్థను రూపుమాపే నియ్యంత ,
    దేశ సార్వభౌమత్వాన్ని సగౌరంగా నిలిపి వుంచగల ధీమంత నియంత
    ప్రజాసమస్యలను వెలుగెత్తి చాటే వారిని గౌరవించే నిబదుడైన నియంత
    మనకీ క్షణం దేశానికి కావాలి.

    కానీ దౌర్భాగ్య మేమంటే ,నియంతగా మారినవాడు నిరంతరం తన అధికారం నిలుపుకోవడానికే ఆతని శక్తి ,యుక్తి ,సమయం ,ఖర్చయి పోతాయి.
    మరో ప్రత్యామ్నాయం వేదకాలిసిన్దేనా ? .

  7. 7 vinay chakravarthi 5:15 పూర్వాహ్నం వద్ద జూన్ 25, 2009

    chaala baagundi..raaayandi ilantivi…memu koncham realize avutam………


  1. 1 ఇప్పుడు రామారావు వంతు. మరి రేపు? « గుండె చప్పుడు… 6:35 పూర్వాహ్నం వద్ద జూన్ 29, 2009 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు