హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై మజ్లీస్ గూండాల దాడి గర్హనీయం. ఆమె తన పుస్తకం “షోద్” ను తెలుగులో వెనిగళ్ల కమల అనువాదం చేయగా ఆవిష్కరించడానికి హైదరాబాద్ వచ్చారు. పాత బస్తీ లో ముస్లింలపై నానాటికీ పట్టు కోల్పోతున్న మజ్లీస్ పార్టీ విద్వేషం రెచ్చగొట్టే పనులు చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది.
అలనాడు నిజాం తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఖాసిం రజ్వీ నేతృత్వంలో ఏర్పరచిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తదనంతర కాలంలో ఓవైసీ నాయకత్వం లో పూర్తికాలం రాజకీయ పార్టీగా అవతరించింది. పాతబస్తీలో ముస్లిముల వెనుకబాటుతనమే ఓటుబ్యాంకుగా ఇన్నాళ్లూ నెట్టుకుంటూ వస్తోంది.
అయితే గత కొంతకాలంగా మజ్లీస్ పార్టీ పై పాతబస్తీ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. ముందు ఆసిఫ్ నగర్ వంటి నియోజికవర్గాలను నాగేందర్ వంటి కాంగ్రెస్ నాయకులు వశం చేసుకున్నారు. ఆ తరువాత ఇటీవలి కాలం లో వామపక్షాలు పాతబస్తీలో క్రియాశీలక పోరాటాలు నిర్వహించడం ద్వారా అక్కడి ప్రజల మద్ధతు సంపాదించారు.
రోజు రోజుకీ విస్తరిస్తున్న నగరం పాత బస్తీ పై కూడా ప్రభావాన్ని వేసింది. ఒకప్పుడు మజ్లీస్ కంచుకోటలుగా ఉన్న టోలీ చౌకీ వంటి చోట్ల ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నివసించడం మొదలైంది. మొన్న మొన్నటి వరకూ రియల్ ఎస్టేట్ వాళ్లు కన్నెత్తి చూడని శ్రీ శైలం రోడ్ చుట్టుపక్కల ప్రాంతం ఇవ్వాళ రియల్టర్ల స్వర్గ ధామంలా మారింది.
ఇవన్నీ మజ్లీస్ లో గుబులు రేకెత్తిస్తున్నాయి. అందుకే గత రెండు మూడేళ్లుగా ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రెచ్చగొట్టి తద్వారా లబ్ది పొందాలని మజ్లిస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
అలనాడు రజాకార్లకు వ్యతిరేకంగా తన పత్రిక లోవార్తలు రాసినందుకు షోయబుల్లాఖాన్ అనే పాత్రికేయుడిని దారుణంగా చేతులు నరికినది ఈ మజ్లిస్ ముష్కరులే, మొన్న సియాసత్ పత్రిక ఎడిటర్ ను అవమానించడానికి అతని పై మల మూత్రాలను కుమ్మరించిందీ సదరు పార్టీ మనుషులే. కాలం మారినా మతోన్మాదం మాత్రం ఇంకా జడలు విప్పుకుంటున్నదనడానికి తస్లీమా పై దాడే ఉదాహరణ. తస్లీమా మళ్లీ హైదరాబాద్ కు వస్తే చంపేస్తామని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు వింటుంటే అలనాడు తెలంగాణ ప్రజలను ఊచకోత కోసిన ఖాసిం రజ్వీ మళ్లీ పుట్టాడా అనిపిస్తున్నది. భావ ప్రకటనా స్వేచ్చపై మతోన్మాదులు చేస్తున్న ఈ వరుస దాడులను అరికట్టి సదరు నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.









తమ ప్రాబల్యం తగ్గిపోతోందే, ఏదో చెయ్యాలి అనే గుబులుతో చేసినట్టే కనిపిస్తోంది. ఒవైసీ గారు no publicity is bad publicity అని నమ్మే రకం కావచ్చు. జనాల్ని భయభ్రాంతుల్ని చెయ్యటం వల్ల కాదు, ప్రజలకి ఉపయోగం కలిగే పనులు చెయ్యటం వల్లనే తమ రాజకీయ భవిష్యత్తు నిలబడుతుందని వీళ్ళకి తెలిసి రావాలి.
ఈ దౌర్జన్యం అమానుషం.
ఎం.ఐ.ఎం దాడి చాలా అరాచకం, అమానుషం.అంత దైర్యంగా ఎం.ఎల్.ఏ లు ఒక మహిళపై దాడికి దిగారంటే చట్టాలను ఈ ఉన్మాదులు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో అర్ధం అవుతుంది.