ఏవేవో కుంటి సాకులు చూపిస్తూ దాదాపు 6000 ప్రభుత్వ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం మూసివేయనున్నదనే వార్త చదివి కోపం వచ్చి “స్కూళ్లు నడవవిక్కడ బార్లు తెరవండి!” అని బ్లాగు పోస్టు రాశాను కొన్నాళ్ల క్రితం.
పైన తధాస్థు దేవతలుంటారంటే ఏమో అనుకున్నాను, నిజ్జంగానే మన రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తోందనే వార్త చూసి నాకు నోటివెంట మాట రాలేదు.
నష్టం వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయ్యాలనే వరల్డ్ బ్యాంక్ బ్రాండ్ అభివృద్ధి మోడల్ లో “లాభం వస్తే ప్రభుత్వం ఏ గడ్డి అయినా కరవొచ్చు” అనే లైను కూడ ఉందా?
నిన్నటి ఆంధ్రజ్యోతి నుండి ఈ వార్త చదవండోసారి
కార్యకర్తల దోసిట్లో ‘తీర్థం’
సర్కారీ మద్యం దుకాణాల ఏర్పాటుకు రెడీ
హైదరాబాద్, జూలై 10 (ఆన్లైన్) కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కార్యకర్తలను సంతృప్తి పరిచే చర్యలు చేపట్టనుంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా తమకు దక్కింది ఏమీ లేదంటూ ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యకర్తల ఆదాయ వనరులను పెంచడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపాలని ఇన్నాళ్లుగా భావిస్తున్న ప్రభుత్వం త్వరలోనే వారికి ఓ కొత్త ఉపాధి మార్గాన్ని చూపించనుంది. సర్కారీ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి, వాటి నిర్వ హణ బాధ్యతలను వారికి అప్పగించా లన్న ఆలోచనలో ఉంది.
పలు జిల్లాల్లో సిండికేట్లుగా ఏర్పడిన మద్యం వ్యాపారులు కనీస అమ్మకం ధరలకు సక్రమంగా అమలు చేయడం లేదు. కాంట్రాక్టర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ కారణాలను చూపిస్తూ… ప్రభుత్వం సర్కారీ మద్యం దుకాణాల తలుపులు తెరవనుంది. ఎక్సైజ్ శాఖాధికారులు కూడా బయటకు ఇవే కారణాలు చెబుతున్నారు. తమిళనాడులో మద్యం దుకాణాలను అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు అమ్మకాలు జరుపుతారు. రాష్ట్రంలో కూడా తమిళనాడు లోని ‘పద్ధతుల’ను అమలు చేయనున్న ట్టు ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి జక్కం పూడి రామ్మోహనరావు ప్రకటించారు. దీని ఆంతర్యం కూడా కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకే అని స్వయంగా ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి పలు జిల్లాల్లో పర్యటించినప్పుడు కార్యకర్తలు తమకు ఎలాంటి ఆదాయం లేదని, ఏవైనా పనులు ఇప్పించాలని కోరారు. ఆ తర్వాత కొందరికి నామినేషన్పై పనులు కూడా అప్పగించారు. విశాఖపట్నంలో కార్యకర్తలు ఒత్తిడి చేయడంతో త్వర లోనే ఓ నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ నేపథ్యమే… సర్కారీ మద్యం దుకాణాల ఏర్పాటుకు దారితీస్తోంది. త్వరలో 13 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించనుంది. ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహిస్తే ఆదాయానికి కొంత మేరకు గండి పడుతుంది. అయినా, కార్యకర్తలను ప్రసన్నం చేసుకొని, రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలంటే ఈ మాత్రం త్యాగం చేయకతప్పదని భావిస్తున్నది.









0 స్పందనలు నుండి “పైన తధాస్థు దేవతలుంటారంటే ఏమో అనుకున్నాను!” కు