చంద్ర బాబు హయాం లో “అభివృద్ధి” జోరుగా సాగుతున్న కాలంలో ప్రముఖ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ గారు (kadalitaraga.wordpress.com) “అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్” అని ఒక పుస్తకం రాశారు. బాగా ప్రజాదరణ పొందిన ఆ పుస్తకం లో వేణుగారు ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యం లో మన రాష్ట్రం లో జరుగుతున్న “అభివృద్ధి” నమూనాను తూర్పారాబట్టారు. బ్రోకర్లు, కన్సల్టెంట్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా పంచుకు తినబోతున్నారో ఆ పుస్తకంలో విపులంగా రాశారు.
ఇప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న “అభివృద్ధిని” చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. అరె దేశాన్నీ, రాష్ట్రాన్నీ డెవలప్ చేయడం ఇంత సులభమైతే దాన్ని కనుక్కోవడానికి మనవాళ్లకు 44 ఏళ్లు (1947-1991) ఎందుకు పట్టిందబ్బా అని ఒక్కోసారి అనుమానం కూడా వస్తుంది.
ఒక్క హైటెక్ సిటి కట్టి రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో చంద్రబాబు నేర్పిన విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొత్త అక్రమాలు చేయడానికి అమోఘంగా ఉపయోగిస్తోంది.
నిన్ననే కదూ మనం ఐ.ఎం.జీ కుంభకోణం గురించి మాట్లాడుకున్నాం? దాని గురించి జరుగుతున్న విచారణలో భాగంగా నిన్న హైకోర్టు ఏమన్నదో చూడండి…
“అమెరికా కంపెనీ 20 వేల మిలియన్ డాలర్లు ఇస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ను అమ్మేస్తారా? దానికి చట్టం అనుమతిస్తుందా? ఆ మాటకొస్తే భారత ప్రభుత్వం ఇండియాను అమ్మేస్తామని చెప్పగలదా? వారికి ఆ అధికారం ఉందా? ప్రజల ఆస్తులను ఈ విధంగా ధారాదత్తం చేసే అధికారం ప్రభుత్వాలకుందా?” అని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఇక రాష్ట్రానికి వచ్చిన “మొదటి” ఫ్యాబ్ సిటీ ప్రాజెక్టు (నానో టెక్ పార్క్) గతి ఏమిటో ఇవ్వాళటి ఆంధ్ర జ్యోతి కధనం చదవండి…
రాజీవ్ ‘నానో ‘ పార్కు గాయబ్
రాష్ట్రం నుంచి మరో మెగా యూనిట్ ఔట్
హైదరాబాద్, ఏప్రిల్ 23 (ఆన్లైన్) దేశంలోనే తొలి మెగా ఫ్యాబ్ ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కింది. దీంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించబోతోంది. 2005 జూన్ 26న నానో -టెక్ సిలికాన్ ఇండియాకు భూమి పూజ చేసిన అనంతరం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. చరిత్ర సృష్టించే సంగతేమో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ‘ఫ్యాబ్’ ప్రాజెక్టును పట్టుకున్నా షాక్ కొడుతోంది. వినోద్అగర్వాల్కు చెందిన సెమ్ ఇండియా వివాదంలో కొట్టుమిట్టాడుతున్న సర్కారుకు తాజాగా మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో తొలి ఫ్యాబ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన నానో- టెక్ సిలికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎస్ టిఐ) బిచాణా ఎత్తేసింది. ఈ ప్రాజెక్టు ప్రమోటర్గా ఉన్న దక్షిణ కొరియాకు చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ జున్మిన్ ఇప్పటికే దుకాణం సర్దేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆయన రెండే ళ్ళ పాటు ఐటీ శాఖ సమకూర్చిన నిధులతోనే హైద రాబాద్లో ఓ ఆఫీసు ప్రారంభించి, స్టార్ హోటళ్లలో జల్సాగా కాలం వెళ్లబుచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఐటీ శాఖ నుంచి ఆయన ఖాతా కు ఏ మేరకు నిధులు వెళ్లాయనే విషయంపై అధికారులు పెదవి విప్పటం లేదు. ఫ్యాబ్సిటీ ప్రతిపాదన రూపుదాల్చక ముందే దక్షిణ కొరియాకు చెం దిన జున్మిన్ హైదరాబాద్లో 2600 కోట్ల రూపా యల పెట్టుబడితో చిప్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనా సంస్థ (ఎపి ఐఐసి) రంగారెడ్డి జిల్లాలోని శ్రీనగర్ గ్రామంలో 50 ఎకరాల స్థలం కేటాయించింది.
2005 సంవ త్సరం జూన్ 26న నానోటెక్ సిలికాన్ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు రాజీవ్ గాంధీ నానోటెక్నాలజీ పార్కుగా నామకరణం చేశారు. భూమి పూజకు కొన్ని నెలల ముందు ప్రభుత్వం ఎన్ఎస్టిఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని రెండేళ్లు దాటు తున్నా ప్రాజెక్టు పని ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో నానో టెక్నాలజీ పార్కుకు భూమి కేటాయించిన ఎపిఐఐసి రెండుసార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్యాబ్ ప్రాజెక్టు అమలులో విపరీత జాప్యం జరగటంతో ఈ వ్యవహారం కాస్తా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరినారాయణ వద్దకు చేరింది. న్యాయశాఖ సలహా తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించి నట్లు ఎపిఐఐసి వర్గాలు తెలిపాయి.
దీంతో ఎపిఐఐసి తాజాగా కోట్లాది రూపాయల విలువ చేసే 50 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు ప్రారంభించిందని చెబుతున్నారు. భూమి పూజ జరిగిన పదిహేను నెలల్లో నానోటెక్నాలజీ పార్కులోని తొలి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని నానోటెక్ సిలికాన్ ఇండియా ఛైర్మన్ పి. జున్మిన్ అప్పట్లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు భూమి పూజ జరిగి 22 నెలలు కావస్తున్నా తొలి యూనిట్ కాదు కదా…. ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చోటుచేసుకో లేదు. అగ్రశ్రేణి సంస్థ ఇంటెల్తో ఒప్పందం త్వరలో జరగబోతోందని, ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమయ్యే నిధుల సమీకరణ కూడా పెద్ద కష్టం కాబోదని జున్మిన్ ప్రభుత్వ అధికారులను నమ్మిస్తూ కాలం గడిపేశాడు.
తానైతే ఈ ప్రాజెక్టును ఇట్టే అమలుచేయగలనని ప్రకటిం చిన ఎపి ఇన్వెస్ట్ సిఇవో సి ఎస్ రావు ఏడాది పాటు నానోటెక్ సిలికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫైలును తన వద్దే అట్టిపెట్టుకుని ఎలాంటి పురోగతి కన్పించక పోవటంతో దీన్ని మళ్ళీ ఐటి శాఖకు తిరుగుటపాలో పంపారు. జున్మిన్ ప్రాజెక్టు, ఫ్యాబ్ సిటీ ప్రాజెక్టు పనులను సి ఎస్ రావుకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొంత మంది అధికారులు ఎంతో ఉత్సాహం చూపారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఫ్యాబ్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించటంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది దోహదపడగలదని ప్రభుత్వ వర్గాలు ఊదరగొట్టినా జరిగింది మాత్రం శూన్యం. కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచటం తప్ప పారిశ్రామికంగా రాష్ట్రానికి జరిగే ప్రయోజనం మాత్రం ఎక్కడా కన్పించటం లేద నే విమర్శలు విన్పిస్తున్నాయి.









DAMN
ప్రముఖ నాటక రచయత కీ.శే కొర్రపాటి గంగాధర రావు గారు ఎప్పుడో చెప్పినట్లు ‘5 రూపాయలకు ఓటు వేసే జనాలకి 500 కి దేశాన్ని అమ్మేశే ప్రభుత్వమే వస్తుంది. తప్పు ఎక్కడ వుంది? ఎవరిది?
-నేనుసైతం
ప్రజలను ఆ 5 రూపాయలకు ఆశపడేలా చేసిన పాలకులదే తప్పు. దేశం లో అనేక మంది ఓటర్లు ఎన్నికలు వస్తే నాలుగు రాళ్లు వస్తాయని ఎదురుచూసే పరిస్థితి ఉంది నేడు. అయినా మిగతా సమయాల్లో దోచుకున్న ప్రజా ధనం లో కాస్తయినా ఎన్నికలప్పుడే ప్రజలకు చేరుతుందేమో అనిపిస్తుంది నాకు