బాసరకో న్యాయం బందరుకో న్యాయం!

గత వారం జరిగిన రెండు సంఘటనలు ఒక విషయాన్ని చాలా నగ్నంగా నిరూపించాయి. ఈ రాష్ట్రం లో తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం జరుగుతోందని ఎంతో కాలంగా చెబుతున్న విషయాన్ని వైయెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిరూపించి చూపింది.

అదిలాబాద్ జిల్లాలో బాసర ఐఐటీ విషయంలో ఒక న్యాయం, మచిలీపట్నం ఓడ రేవు విషయంలో మరో న్యాయం జరిగింది మన కళ్ల ముందే. ప్రజల మనోభావాల విలువ ప్రాంతానికో విధంగా ఉంటుందని సెలవిస్తుంది మన స్వర్ణోత్సవ రాష్ట్ర ప్రభుత్వం. ముందో సారి ఈ రెండు అంశాల పూర్వాపరాలు పరిశీలిద్దాం

బాసరలో ఐఐటీ ఏర్పాటు కోసం చంద్ర బాబు హయాం లోనే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో రాష్ట్ర శాసన సభ దీని గురించి ఒక ఏకగ్రీవ తీర్మాణం కూడా చేసింది. వై యెస్ ప్రభుత్వం వచ్చాక మరో సారీ రాష్ట్ర శాసన సభ బాసర ఐఐటీ విషయం పై ఏకగ్రీవ తీర్మాణం చేసింది. తీరా ఐఐటీ సాంక్షన్ కాగానే రాజ శేఖర రెడ్డి ప్లేటు ఫిరాయించి ఐఐటీ బాసరలో కాదు మెదక్ జిల్లాలో పెడతామని ప్రకటించాడు. కేంద్రం బాసరలో అయితే పర్మిషన్ ఇవ్వనందని నిండు సభ ముందు, పత్రికా విలేకరులతో పచ్చి అబద్దం చెప్పాడు. మరునాడు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ ఐఐటీ సాంక్షన్ చేయడం వరకే తమ పని అని, అది ఎక్కడ పెట్టుకోవాలో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కుండ బద్దలు కొట్టడం తో వై యెస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొన్ని కుంటి సాకులు ఏకరువు పెట్టాడు. బాసరలో విమానాశ్రయం లేదనీ, అక్కడ ఫ్యాకల్టీ ఉండరనీ ఇలా…

పేరుకి మెదక్ జిల్లా అన్నా ఇప్పుడు ఐఐటీ పెడదామనుకుంటున్న ప్రదేశం హైదరాబాదు శివారు కిందికే వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం లోని అభివృద్ధి అంతా హైదరాబాదు చుట్టే కేంద్రీకృతమైపోతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇక బాసర ఎందుకు వద్దో చెబుతున్న కారణాలు కూడా హేతు బద్దమైనవి కావు. ఏ విమానాశ్రయం లేకుండానే ఖరగ్పూర్ వంటి చోట ఐఐటీలు పెట్టలేదా? చిన్న ఊరిలో నెలకొల్పిన బిట్స్ పిలానీ ఎంత పేరు పొందిందో మనకు తెలియనిదా? ఒక మారు మూల పల్లెలో పెద్ద పరిశ్రమ పెట్టి అసామాన్య విజయాలు సాధిస్తున్న అమర రాజ బ్యాటరీస్ కథ వినలేదా మనం? సంకల్పం ఉండాలే కానీ ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు అధిగమించడం ఎంత సేపు?

ఐఐటీ బాసరలోనే స్థాపించాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బంద్ లు, నిరాహార దీక్షలు, ధర్నాలు ఎన్నో జరిగాయి. అన్ని రాజకీయ పార్టీలు బాసరలోనే ఐఐటీ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఒక విధంగా ఈ అనవసర వివాదం లేవదీసి దీన్ని తెలంగాణ లోని రెండు జిల్లాల మధ్య తగాదాగా మార్చివేసే ప్రయత్నం కూడా చేసింది ప్రభుత్వం. ఏదో కంటి తుడుపుగా ఒక స్థల పరిశీలన కమిటీ వేసింది. ఆ కమిటీ పోయిన వారం తన నివేదిక లో ఐఐటీ మెదక్ జిల్లాలోని కంది గ్రామం వద్దనే నెలకొల్పాలని చెప్పింది.

మచిలీపట్నం ఓడ రేవు ది మరో కధ. ముందుకృష్ణా జిల్లా గోగిలేరు ఈ ఓడరేవు నిర్మాణానికి అనువుగా ఉంటుందని నిర్ణయించిన ప్రభుత్వం అక్కడ ఈ పోర్టు నిర్మాణం కోసం సత్యం కంప్యూటర్స్ వారి మేటాస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. సదరు కంపెనీ దీనికోసం 6000 ఎకరాల స్థలం కూడా సేకరించింది.

పోర్టు గోగిలేరు లో కాకుండా మచిలీపట్నం దగ్గరలోని గిలకలదిన్నె లోనే నిర్మించాలని ప్రజల, ప్రజాప్రతినిధుల నుండి వత్తిడి వచ్చింది. ఇది రాను రాను తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.

ఇప్పుడు ఇలా స్థలమార్పు చేయడం వలన ప్రభుత్వానికి అదనంగా 500 కోట్ల వరకూ అదనంగా ఖర్చు కాగలదని అంచనా. గోగిలేరుతో పోలిస్తే తక్కువ లోతులో ఉండటం వలన గిలకలదిన్నెలో అదనంగా డ్రెడ్జింగ్ చేయవలసి రావడం, సాండ్ ట్రాప్ నిర్మించాల్సి రావడం వల్ల పోర్టు నిర్మాణపు ఖర్చులు పెరగడమే కాక ప్రతి యేటా మెయింటెనెన్స్ ఖర్చు కూడా బాగానే పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ పోర్టు కోసం అల్రెడీ గోగిలేరు లో సేకరించిన 6000 ఎకరాలు ఎస్.ఈ.జెడ్ గా మార్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.

ఐఐటి గురించి వార్త వచ్చిన మరునాడే మచిలీపట్నం పోర్టు స్థలం మార్పు విషయం పేపర్లలో వచ్చింది. ఈ సంధర్భంగా వై యెస్ ఇలా అన్నాడు “ప్రజల మనోభావలు గౌరవిస్తూ, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మాణం చేసినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది”

“ప్రజల మనోభావాలూ, “ఏకగ్రీవ తీర్మాణం”…వహ్వా…ఏం చెప్పావు వైయెస్సూ….బాసరకొక న్యాయమూ బందరుకు ఒక న్యాయమూనా?…ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ విషయంలో నీ కపటత్వం మరో సారి బయటపెట్టుకున్నావు. రేపు ఎన్నికల్లో వారు నీకు, కాంగ్రెస్ కు తగిన గుణపాటమే చెబుతారు.

9 స్పందనలు నుండి “బాసరకో న్యాయం బందరుకో న్యాయం!” కు


  1. 2 బ్లాగరు 5:50 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2007

    పెట్టకపోతే తెలంగాణాకి అన్యాయం అంటారు…పెట్టినా ఇష్టం వచ్చిన చోట పెట్టకపోతే అన్యాయం అంటామా? మనలో ఇంత వేర్పాటు వాదం (తెలంగాణా జిల్లాలలోనే ఒక జిల్లా పై మరొక జిల్లా కత్తి కట్టడం) వుంటే తెలంగాణా సాధించగలమా? అసలు IIT ఎక్కడ పెడితే ఏమిటి? తెలంగాణాలో పెట్టినారా లేదా? ఎక్కడో కడపన పెట్టలేదు కదా? బాసరలో పెడితే అక్కడి విద్యార్ధులు బాసర వారు వుంటారా? లేదా IIT entrance పాస్ అయిన వారుంటారా? చుక్కా రామయ్య ఏమన్నా మహాత్ముడా? ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టెయ్యడానికి? ఇలా చిన్న చిన్న విషయాలు వివాదం చెయ్యటం కె.సి.ఆర్ గానికే చెల్లింది. తరువాత నీ బ్లాగుకి చెల్లింది. తెలంగాణా వచ్చాక ఈ లొల్లి చేసే జనాభా తెలంగాణా రాష్ట్రాన్ని శాంతంగా వుంచుతారని నమ్మకమే లేదు. వచ్చిన ఫండ్స్, మాకంటే మాకు అని కొట్టుకోరని నమ్మకమేంది?

  2. 3 Ambanath 10:58 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2007

    బాసరలో IIT పెట్టడం మన దేశానికి మంచిది కాదు.అది మూడు దేశాల సరిహద్దులో ఉండడమే అసలు కారణం.IITలో చేరబోయే ముందు విద్యార్థులు ఎక్కడ చేరదల్చుకున్నారో priority-wise options నింపాల్సి ఉంటుంది.మన పొరుగు దేశాలవారంతా మొదటి రెండు options బొంబాయి బాసర రాసేస్తారు.తద్వారా మన దగ్గర ఉన్న IITలో మన తెలుగు విద్యార్థులు తగ్గిపోతారు.సీట్లు మరీ ఎక్కువ ఉండవు గనుక మళ్ళీ యథాప్రకారం తెలుగు విద్యార్థులు కలకత్తా బండి-లేకపోతే చెన్నై బండి అందుకోక తప్పదు.

    ఎవడో చుక్కా రామయ్య అనే ఒక అహంకారపు తిక్క ముసలి లెక్కల పంతులు చెప్పిన దానికల్లా మనం తాన తందాన అంటూ గంతులెయ్యడం మనకి సుదీర్ఘ కాలంలో మంచిది కాదు.

  3. 4 Dil 11:08 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2007

    స్పందించినందుకు థాంక్స్.

    ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఒక్కటే. ప్రజల మనోభావాల విలువ తెలంగాణాలో ఒక రకంగా, ఆంధ్రా లో ఒక రకంగా ఉండవని.

    ఐఐటీ ఏర్పాటు రెండు జిల్లాల మధ్య తగాదాగా మార్చింది ప్రభుత్వమని, నేను కాదని పోస్టు జాగ్రత్తగా చదివితే అర్ధం అవుతుందనే అనుకుంటున్నాను.

    బాసరలో ఐఐటీ పెట్టాలని రాష్ట్ర శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మాణం అమలు చెయ్యమంటే, మీరు చుక్కా రామయ్య గురించి ప్రశ్నించారు.

    ఇక బాసరలో పెట్టినా బందరులో పెట్టినా ఐఐటీకి వచ్చే విద్యార్ధులు ఎంట్త్రన్స్ రాసే వస్తారనే జనరల్ నాలెడ్జి నాకు కానీ, ఈ కాంటెక్స్టులో కానీ అస్సలు అవసరం లేదు…

  4. 5 Dil 11:35 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2007

    నా జవాబు “బ్లాగరు” ను ఉద్దేశించిందని, అంబానాధ్ గారిని కాదనీ గమనించ ప్రార్ధన!

  5. 6 Jaya Prakash 2:30 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 10, 2007

    ఇదే వరుసల బాబ్లీ, పోలవరంని కూడ చేర్చొచ్చేమో ?

    పోలవరంనీ ఆపడానికి ప్రయత్నించే వారిని ఏట్ల ఊచకోత కోసినా అడిగే దిక్కేలేదు, మీడియాల ప్రస్థావించే నాథుడే లేడు?

    అదే బాబ్లీకి వెల్లిన సదరు నాయకులను లాఠీ చార్జ్ చేస్తే మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతోటి అన్ని పత్రికలల్ల రాయాలె?

    బాబ్లీకి ఒక న్యాయం, పోలవరంకి ఒక న్యాయమా?

  6. 7 తెలుగు అభిమాని 6:26 అపరాహ్నం వద్ద మార్చి 9, 2008

    నిజాం పిశాచి పాలన వల్ల ఏర్పడిని ghetto mentality తెలంగాణా మేధావులలో ఇంకా కొనసాగుతుంది అనిపిస్తుంది ఇలా ప్రతివిషయాన్నీ రంగుటద్దాలలో చూస్తే. సాధారణంగా ఒక నిరంకుశ పాలన లో నలిగి పోయిన ప్రజలు తిరగబడి స్వాతంత్ర్యం సంపాదించుకున్న తరువాత కూడా ఇతరులతో సాంస్క్రుతికంగా మానసికంగా కలవటానికి ఇష్టపడరు. వాళ్ళు బయటికి పోరు. ఇతరులు వస్తే ఒప్పుకోరు.ఎవరు అభివృద్ధి చెందినా ( ఇతరుల so called అభివృద్ధి ఎండమావే అన్న విషయం ససేమిరా ఒప్పుకోరు) తమకు అన్యాయం జరిగినట్టే భావిస్తున్నారు. అన్నా! నా పరిశీలన మీద నీ అభిప్రాయమేమి? నా విన్నపం ఒక్కటే. సమైక్యవాది వాదన నీ దృష్టిలో తప్పయినా వాడి అభిప్రాయం ప్రకటించుకునే స్వేచ్చ వాడికి ఇవ్వాలా వద్దా? -g.kiran kumar.

  7. 8 సిద్ధార్థా పాములపర్తి 1:55 అపరాహ్నం వద్ద మార్చి 2, 2009

    @g.kiran kumar

    మీరంటున్న ‘స్వేచ్చా వాదం’ మరి మీరు విమర్శిస్తున్న తెలంగాణా మేధావులకు ఉండొద్దా? ఏ విషయాన్ని విమర్శించాలో, ఏ విషయం చిన్నదో, ఇది ఎవరు నిర్ణయిస్తారో?


  1. 1 పొద్దు » Blog Archive » గుండెచప్పుడు విందాం.. 12:53 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 27, 2009 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,708 సందర్శకులు